స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

22A Controversy: ధరణి, భూ భారతి, 22ఏ దోపిడీ.. ముందే హెచ్చరించిన ‘స్వేచ్ఛ’!

రచన: Swechaanews Chairman19, ఆగ 20268 నిమిషాల పఠనం

తెలంగాణలో భూ సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా ముసుగులో జరుగుతున్న అన్యాయాలపై 'స్వేచ్ఛ దినపత్రిక' మొదటి నుంచి చేస్తున్న హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయి. డిజిటలైజేషన్ పేరిట సామాన్యుల ఆస్తులను హరించేందుకు సాగుతున్న మహా కుట్రను ‘స్వేచ్ఛ’ ముందే ఊహించి బయటపెట్టగా, తాజాగా తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భూ నిపుణులు, విశ్రాంత అధికారులు, భూ బాధితులు అదే విషయాన్ని స్పష్టం చేశారు.

  • 'స్వేచ్ఛ' వేదికగా 4 కీలక తీర్మానాలు!

  • హక్కుల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ

  • వరల్డ్ బ్యాంక్ బాటలోనే భూ సంస్కరణలు

  •  డిజిటల్ రికార్డుల మానిప్యులేషన్ కుట్ర

  •  ధరణి, భూ భారతి ఒక్కటే..

  • ‘22ఏ’ వాటికి మించిన భూతం

  • న్యాయం జరిగే వరకూ పోరాడుతాం: స్వేచ్ఛ చైర్మన్

 తెలంగాణలో భూ సమస్యలు, 22ఏ నిషేధిత జాబితా ముసుగులో జరుగుతున్న అన్యాయాలపై 'స్వేచ్ఛ దినపత్రిక' మొదటి నుంచి చేస్తున్న హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయి. డిజిటలైజేషన్ పేరిట సామాన్యుల ఆస్తులను హరించేందుకు సాగుతున్న మహా కుట్రను ‘స్వేచ్ఛ’ ముందే ఊహించి బయటపెట్టగా, తాజాగా తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో భూ నిపుణులు, విశ్రాంత అధికారులు, భూ బాధితులు అదే విషయాన్ని స్పష్టం చేశారు. భూమిని ఒక వ్యాపార వస్తువుగా మార్చి డిజిటల్ రికార్డుల మానిప్యులేషన్‌తో సామాన్యులను ముంచెత్తుతున్న తీరుపై నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘స్వేచ్ఛ’ వేదికగా 4 కీలక తీర్మానాలు!

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల బాధితుల పక్షాన నిలబడేందుకు 4 కీలక తీర్మానాలను ప్రతిపాదించారు. మొదటిది రైతులు, గ్రామీణ ప్రజల భూ సమస్యలు, ఎల్ నినో ప్రభావంపై పోరాడేందుకు అన్ని సంఘాలతో కలిసి 'జాయింట్ యాక్షన్ కమిటీ' (JAC) ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రెండో తీర్మానం.. హైకోర్టు రిటైర్డ్ జడ్జీలతో ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ నివేదికకు కట్టుబడి ఉండేలా చూడాలన్నారు. మూడో తీర్మానం.. ఏపీ, గుజరాత్, ఎంపీ తరహాలో తెలంగాణలోనూ 'టైటిల్ గ్యారెంటీ' చట్టం తేవాలని కోరారు. అదే విధంగా నాల్గో తీర్మాణం అసైన్డ్ భూములకు క్రమబద్ధీకరణ చేసి విక్రయ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

హక్కులు నిర్ణయించడానికి వ్యవస్థ అవసరం..

హక్కులు నిర్ణయించే స్పష్టమైన వ్యవస్థ లేకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ రాంబాబు స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్‌ను ప్రక్షాళన చేయాలని సూచించారు. యజమానులకు తెలియకుండా రికార్డులు మారిస్తే దాన్ని తీవ్రమైన నేరంగా భావించి చట్టంలో ప్రత్యేక శిక్షా నిబంధనలు చేర్చాలని, దీనిపై పోరాడేందుకు జేఏసీ వేదికగా ముందుకు సాగాలని ఆయన కోరారు.

సులభంగా డిజిటల్ రికార్డుల మానిప్యులేషన్..

గ్లోబలైజేషన్ నుంచి భూమిని పెట్టుబడి వస్తువుగా మార్చేందుకు 1999లో ప్రపంచ బ్యాంక్ తీసుకొచ్చిన సంస్కరణలే నేటి గందరగోళానికి మూలమని నిపుణులు దుంతి నర్సింహారెడ్డి ఎండగట్టారు. గత పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన ఎన్టీఆర్ కాలం నుంచి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తెచ్చిన కంప్యూటరీకరణ, ప్రత్యేక తెలంగాణలో డిజిటల్ నినాదం ఎత్తుకున్నారని తెలిపారు. ధరణి, భూ భారతి వరకు అన్నీ వరల్డ్ బ్యాంక్ బాటలోనే సాగాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు.. కేంద్రంలోని యూపీఏ ఆ తర్వాత ఎన్డీయే అన్ని ప్రభుత్వాలదీ అదే బాట అన్నారు.

ధరణి చట్టం తెచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. భూ భారతిలో మాత్రం ప్రజలతో సంప్రదింపులు అయినా జరిపిందని చెప్పారు. పాత చట్టానికి ఒకటే లైన్ మార్చి డిజిటల్ రికార్డ్స్ ఉంటాయని చెప్పారు. రెండు మూడు పదాలు పెట్టి ధరణి చట్టం తెచ్చారని. తాము మొదటి నుంచి కూడా డిజిటలైజేషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామన్నారు. డిజిటల్ రికార్డులను ఇష్టారీతిన మార్చేశారని దీంతో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అమలు కాకపోవడం వల్ల డిజిటల్ రికార్డులను చాలా సులభంగా మానిప్యులేట్ చేస్తున్నారని, ఇది ప్రజలను మళ్లీ చీకటి వ్యవస్థలోకి నెడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ధరణి, భూభారతి రెండూ ఒక్కటే..

ధరణి, భూ భారతి ఒక్కటేనని ఈ రెండు చట్టాలను డ్రాఫ్ట్ చేసిందీ ఒక్కరేనని రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజు సంచలన విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పుడు ధరణి, భూ భారతికి మించిన భూతం 22ఏ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ హయాం 2004లో ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములను నిషేధిత జాబితాలోకి నెట్టి ఇవాళ సామాన్యులను పీడిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతీ మండలానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములు ఎవరికీ అసైన్ చేయకుండా స్కూల్ కో, ఆసుపత్రికో వాడుకోవచ్చు అని రాసి పెట్టుకున్నారన్నారు.

అదే నిషేధిత జాబితా అని, అంటే.. అమ్మడం, కొనుగోలు నిషేధించడం కోసం తయారు చేయబడిన లిస్ట్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం మార్చినా చట్టాల రూపం మారకపోవడం వెనుక ఉన్న అసలు కుట్రను ఆయన గుర్తుచేశారు. తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయి, మేడ్చల్ రిటైర్డ్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి రఫీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో భావితరాల భూ హక్కుల పరిరక్షణకు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ దినపత్రిక మొదటి నుంచి చెప్తున్నట్లే భూ బాధితులకు న్యాయం జరిగే వరకు, 22ఏ, ధరణి లొసుగులు తొలగించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్వేచ్ఛ చైర్మన్ దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

#r Land Scam Probe#Telangana Dharani Bhoo Bharati 22A Controversy#Swecha Land JAC Resolutions#Land Rights Title Guarantee Telangana#Telangana Revenue Prohibited Lands 22A#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి