తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70వేల కొలువులు ఇచ్చామంటూ చేస్తున్న ప్రచారంలో అసలు నిజం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్తున్న ఆ ఉద్యోగాల జాబితాలోనే 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులు కూడా భాగమేనని గుర్తుచేసిన ఆయన, కనీసం ఒక్క రూపాయి కూడా వేతనం అందించకుండా వాటిని ఉద్యోగాలని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటారని నిలదీశారు. సరైన ఆదరణ లేక, ఆర్థిక భారం పెరిగిపోవడంతో ఇప్పటికే ఇద్దరు యువ సర్వేయర్లు తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నుంచి నయా పైసా జీతం అందకపోవడంతో పాటు ఆరోగ్య భద్రత, రవాణా భత్యాలు లేక సర్వేయర్లు అల్లాడిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల సర్వేల కోసం అయ్యే పెట్రోల్ ఖర్చులు కూడా వారి సొంత జేబుల నుంచే పెట్టుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి దయనీయ పరిస్థితిపై బాధితులు ఐఏఎస్ అధికారి లోకేష్ కుమార్ను కలిస్తే, సమస్యను పరిష్కరించాల్సింది పోయి ‘రైతుల వద్ద లంచాలు తీసుకోండి’ అని బాధ్యతారాహిత్యంగా ఉచిత సలహాలు ఇవ్వడం పరిపాలనా లోపానికి నిదర్శనమని తప్పుబట్టారు. ఒక ఉన్నతాధికారి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవడానికి వెళితే చేతికి ఏది దొరికితే దాంతో కొడతారంటూ అనుచితంగా మాట్లాడటం దేనికి సంకేతమని హరీశ్ రావు ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న నేతలు, అధికారులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను విన్నవించుకునేందుకు కలెక్టర్లను ఆశ్రయిస్తే లంచాలకు అలవాటు పడాలని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్యాయానికి గురవుతున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, ఈ అక్రమాలను, అధికారుల వైఖరిని ఎండగడతామని స్పష్టం చేశారు. బాధిత సర్వేయర్ల సమస్యల పరిష్కారం లభించే వరకు ప్రజాక్షేత్రంలోనూ, చట్టసభల్లోనూ పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.











