తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వివాదం హాట్ టాపిక్గా మారింది. భూమి రిజిస్ట్రేషన్కు అడ్డంకిగా మారిన ఈ 22ఏ జాబితాలో తమ భూములు చేరాయంటూ పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అసలు ఈ 22ఏ వివాదం ఎక్కడ మొదలైంది?
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ ప్రకారం ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ తదితర కొన్ని కేటగిరీలకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లను నిషేధించే అవకాశం ఉంటుంది. అయితే.. ప్రైవేట్ పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలోకి వచ్చాయంటూ పలుచోట్ల భూ యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమస్య తీవ్రతరమైంది. కొన్ని సందర్భాల్లో మొత్తం సర్వే నంబర్నే నిషేధితంగా చూపించడం వల్ల అసలు తమ భూమిలో ఎంత భాగం 22ఏ పరిధిలో ఉందో స్పష్టత లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయనే వాదనలు కూడా ఉన్నాయి.
22ఏలో భూమి చేరితే నష్టం ఏమిటి?
సాధారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవచ్చు. భూమిని అమ్మడం, కొనడం, బ్యాంకు రుణం పొందడం, ఆస్తి లావాదేవీలు పూర్తి చేయడం వంటి అంశాల్లో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా ఎన్నో ఏళ్లుగా తమ వద్ద ఉన్న భూమిపై హక్కులు ఉన్నప్పటికీ.. దాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు చెబుతున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వం కూడా స్పందించింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్యాయం జరగదని, కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని తెలిపారు. సమస్యాత్మక భూములపై ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ అంశంపై వరుసగా వస్తున్న వార్తా కథనాలతో వివాదం మరింత ముదిరింది. ఆగస్టు 18న 22ఏ కారణంగా ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు మంత్రి పొంగులేటి క్షమాపణలు చెబుతూ.. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ కు రాజకీయ అస్త్రంగా మారిన 22A
తెలంగాణ భవన్లో 22ఏ బాధితులను కలిసిన మాజీ మంత్రి హరీశ్రావు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు. పది రోజుల క్రితం ఒక్క ఎకరం కూడా 22ఏలో పెట్టలేదని చెప్పిన మంత్రి.. ఇప్పుడు ప్రజలకు క్షమాపణలు చెప్పడం ఎందుకని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. నిషేధిత భూముల జాబితా అంశాన్ని నాలుగు నెలల క్రితమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్నారని, అదే నిజమైతే ఇంతకాలం ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని హరీశ్రావు ప్రశ్నించారు.
ఒకవేళ సీఎంకు ఈ విషయం తెలియకపోతే పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ భవన్లో 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ బాధితులు హరీశ్ రావును కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ సమస్యను పరిష్కరిస్తారా లేక ప్రజల కాళ్ల కింద నలిగి పోతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతేకాదు.. 22ఏ బాధితుల కోసం తెలంగాణ భవన్ను జనతా గ్యారేజ్గా మార్చుతామని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ వల్ల మేడ్చల్, రంగారెడ్డి ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. చీటికి మాటికి విచారణలు చేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు..











